Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

అక్రమ కేసులతో అడ్డుకోలేరు

Must read

తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : రాష్ట్రంలో సీఎం జగన్‌ నిరంకుశ ప్రభుత్వం నడుస్తోందని, ఈ పాలనపై నిరంతర పోరాటం చేస్తామని మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు. పట్టణంలో ఆదివారం ఆమె ఇంటి నుంచి మున్సిపల్‌ కార్యాలయం వరకు చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ పట్టణంలో భారీ ర్యాలీని మాజీ మంత్రి అఖిలప్రియ టీడీపీ శ్రేణులతో చేపట్టారు. అనంతరం పట్టణ సీఐ రమేష్‌బాబుకు, తహసీల్దార్‌ కార్యాలయంలో ఉన్న అధికారులకు మాజీ మంత్రి వినతి పత్రాన్ని ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఏ తప్పు చేయకున్నా స్కిల్‌ డెవలప్‌మెంటులో రూ. 3వేల కోట్లు, రూ. 300 కోట్లు, రూ. 27 కోట్లు అక్రమంగా తీసుకున్నారంటూ అక్రమ కేసు బనాయించి అరెస్టు చేశారని అన్నారు. ఇలాంటి అక్రమ కేసులతో సీఎం జగన్‌ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీవారు జెండా మోసినా, ధర్నా చేసినా, ప్రెస్‌మీట్‌ పెట్టినా కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు విడుదల అయ్యేంత వరకు పోరాటం చేస్తునే ఉంటామని అన్నారు. వైసీపీ ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద ధర్నాలు చేసి, వారు బయటకు రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే గుండాలాగా ప్రవర్తిస్తూ అక్రమంగా పొలాలు లాక్కుంటున్నారని, కుటుంబ పంచాయితీలు చేస్తూ కమీషన్లు లాగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా, గంజాయి అమ్ముకునే ప్రదేశ్‌గా సీఎం జగన్‌ మార్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో భార్గవ్‌ రామ్‌నాయుడు, చాగలమర్రి అన్సర్‌బాషా, సల్లానాగరాజు, గుత్తి నరసింహులు, శిరివెళ్ల శ్రీకాంతరెడ్డి, యామా గురప్ప, దొర్నిపాడు సిద్ది సత్యం, భూమా అవినాష్‌రెడ్డి, ఆళ్లగడ్డ కౌన్సిలర్‌ హుసేన్‌బాషా, రమిజాబీ, నూర్జహాన్‌, అహోబిలం గూడురు సంజీవరాయుడు తదితరులు పాల్గొన్నారు.

డోన్‌: సైకో సీఎం జగన్‌ పాలనలో రాష్ట్రం అంధాకారంలోకి వెళ్లిందని టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఆదివారం టీడీపీ ఆధ్వర్యంలో బాబుతో నేను చేపట్టిన నిరాహార దీక్షకు జనసేన నాయకులు బైకులతో ర్యాలీగా వచ్చి సంఘీభావం తెలిపారు. జనసేన నాయకులు లాల్‌పీరా, బ్రహ్మం, షబ్బీర్‌ ఖాన్‌, చంద్ర, సునీల్‌, మద్దిలేటి, మధు, రాజశేఖర్‌, చాముండేశ్వరి, రమేష్‌, మధుసూదన్‌, తదితరులు సంఘీభావం తెలిపారు. దీక్షలో కూర్చున్న వారికి జనసేన పార్టీ కండువాలను వేశారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. వైసీపీ అవినీతి అక్రమాలను ఎండగడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలులో నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిలో నిండా మునిగిన జగన్‌ ఆ బురదను చంద్రబాబుకు అంటించే కుట్రలు చేయడం దారుణమన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మురళీకృష్ణ గౌడు, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, బీసీ సెల్‌ జిల్లా అద్యక్షుడు ప్రజా వైద్యశాల మల్లికార్జున, యువ నాయకులు ధర్మవరం గౌతమ్‌ రెడ్డి, భరత్‌ రెడ్డి, హరినాథ్‌ రెడ్డి, నాగిరెడ్డి, రామ మోహన్‌ రెడ్డి, రామాంజి, తిరుమలేష్‌ రెడ్డి, రఘునాథరెడ్డి, వెంకటనాయుడు, ఎల్‌ఐసీ శ్రీరాములు, నరసింహ ఆచారి, ఎర్రిస్వామిగౌడు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఆదివారం డోన్‌ పట్టణంలోని దీక్షా శిబిరం వద్ద టీడీపీ నాయకులు గుంజిళ్లు తీసి నిరసన వ్యక్తం చేశారు. దీక్షలో కూర్చున్న ధర్మవరం టీడీపీ నాయకులు సీఎం జగన్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేస్తూ గుంజిళ్లు తీశారు.

బేతంచెర్ల: వైసీపీ అరాచక పాలన కొనసాగిస్తోందని, టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని టీడీపీ పట్టణ కార్యదర్శి షేక్షావలి చౌదరి అన్నారు. ఆదివారం బేతంచెర్ల నగర పంచాయితీ హనుమాన్‌ నగర్‌ కాలనీలో టీడీపీ ఆధ్వర్యంలో ‘బాబుతో నేను’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆవుల రామకృష్ణ, చింతకాయల విజయకుమార్‌, రాజ్‌కుమార్‌, తిమ్మరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బనగానపల్లె: చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం బనగానపల్లె నియోజకవర్గంలోని టీడీపీ రైతు సంఘం నాయకులు రిలే దీక్షలో పాల్గొన్నారు. మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ కాట్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, గుల్లదుర్తి పరమేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, హోత్రమాన్‌దిన్నె చంద్రశేఖర్‌రెడ్డి, తుమ్మలపెంట మల్లారెడ్డి, వెంకటరెడ్డి, కొత్తపేట మాజీ సర్పంచ్‌ రామిరెడ్డి, వెంకటాపురం గడ్డం నాగేశ్వరరెడ్డి, గులాంనబీపేట తిమ్మారెడ్డి, తదితరులు దీక్షలో పాల్గొన్నారు. బీసీ ఇందిరమ్మ, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ కాట్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఇతర టీడీపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. సీఎం జగన్‌ అన్ని రంగాలను నిర్వీర్యం చేశారన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా సీఐడీ అధికారులు చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. రైతుల భూములు కూడా తాకట్టు పెట్టడానికి సీఎం జగన్‌ సిద్ధమతున్నారని రైతులు తమ సర్వేనంబర్లు ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలని సూచించారు. దీక్షలు చేపట్టిన వారికి బీసీ జనార్దన్‌రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు.

చాగలమర్రి: రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీకి పతనం తప్పదని టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్సర్‌బాషా అన్నారు. ఆదివారం చాగలమర్రి పాతబస్టాండులోని టీడీపీ కార్యాలయం ముందు చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసన ప్రకటించారు. అనంతరం ర్యాలీ చేశారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతిని కప్పుపుచ్చుకునేందుకే టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపించారు. వైసీపీ అవినీతి, అక్రమాలను చంద్రబాబు ప్రజల్లోకి తీసుకెళ్లడంతోనే జీర్ణించుకోలేక ఆయనపై అక్రమ కేసులతో జైలులో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భూమా యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.

శిరివెళ్ల: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మాజీ సీఎం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందని టీడీపీ మండల కన్వీనర్‌ కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బాబు గారికి తోడుగా కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ పట్ణణంలో ఆదివారం నిర్వహించిన భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమానికి శిరివెళ్ల, గోవిందపల్లె, యర్రగుంట్ల, బోయలకుంట్ల తదితర గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు, భూమా అభిమానులు తరలివెళ్లారు. రాక్షస పాలన సాగిస్తూ నియంతలా వ్యవహరిస్తున్న జగన్‌ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజాతీర్పుకు వైసీపీ నామరూపాలు లేకుండా పోతుందని అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you