తెలంగాణ వీణ , క్రీడలు : ఆసియా క్రీడల్లో భాగంగా నేపాల్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ద్వారా టీమిండియా యువ ఆటగాడు రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. భారత జట్టులో చోటు కోసం ఎంతో కాలంగా ఎదురుచూసిన సాయి కిషోర్కు ఎట్టకేలకు ఆ అవకాశం రావడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలపన సమయంలో 26 ఏళ్ల సాయి కిషోర్ భావేద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. సాయి కిషోర్ భావేద్వేగానికి గురైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిజానికి అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్ర మ్యాచ్ ఏ ఆటగాడికైనా ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఎంతో కాలంగా ఎదురుచూసిన అవకాశం ఎట్టకేలకు రావడంతో పలువురు ఆటగాల్లు ఇదే మాదిరిగా భావోద్వేగానికి గురవుతుంటారు. ఇక తమళనాడుకు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నరైన సాయి కిషోర్కు దేశవాలీ క్రికెట్లో ఎంతో అనుభవం ఉంది. తమిళనాడు ప్రీమియర్ లీగ్, ఇండియన్ డొమెస్టిక్ సర్కూట్లో అనేక సీజన్లలో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్లో చెన్నైసూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.