తెలంగాణవీణ , కీసర : అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగ గురువు శంకరాచారి ఆధ్వర్యంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని సాయి భవాని ఫంక్షన్ హాల్లో యోగ వేడుకలను 21 శనివారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ, “నాకు ఇప్పుడు 72 ఏళ్ల వయసు ఉందని. నా ఆరోగ్య రహస్యం ప్రతి రోజూ యోగా చేయడమే,” అని తెలిపారు. యోగా వల్ల శరీరం, మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా హఠ యోగ ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు శంకరాచారి మాట్లాడుతూ, యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా, మనస్సు, శరీరం, శ్వాసపై నియంత్రణ కలిగించే గొప్ప శాస్త్రమని వివరించారు. యోగాను ప్రతిరోజూ ఆచరించడం వల్ల ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరిగి, ఒత్తిడి ఆందోళన తగ్గుతుందని అన్నారు. రక్తపోటు మధుమేహం లాంటి దీర్ఘ కాలిక వ్యాధులను నయం చేయడంలో యోగ బ్రహ్మాస్త్రం లా పనిచేస్తుందని తెలిపారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ యోగ సాధన చేస్తూ ఆయురాగ్యాలతో ఆనందంగా జీవించాలని పిలుపునిచ్చారు.

భవిష్యత్తులో ప్రజల్లో యోగ పై అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఎందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ యోగా ఆసనాలతో పాటు అందులోని మెళకువలను ఆసక్తిగా నేర్చుకుంటూ చురుకుగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపల్ మాజీ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, జవహర్ నగర్ మాజీ మేయర్ లు దొంతగాని శాంతి కోటేశ్ గౌడ్, మేకల కావ్య, బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు వచన్ కుమార్, గోగుల సరిత, టీ పీ సీ సీ కార్యదర్శి గోగూరి దేవేందర్ రెడ్డి, జవహర్ నగర్ సీఐ సైదయ్య, అడ్మిన్ ఎస్ ఐ ఇద్రిస్ అలీ, మహిళా ఎస్ ఐ బీ మమత, జవహర్ నగర్ మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, డీ ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రగుడ్ల వెంకటేశ్వర్, రాష్ట్ర బీసీ సంఘాల జే ఏ సీ చైర్మెన్ కుందారం గణేష్ చారి, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వివిధ పార్టీల అధ్యక్షులు, ప్రజా సంఘాల నాయకులు పెద్దయెత్తున ప్రజలు పాల్గొన్నారు.
