తెలంగాణవీణ, హైదరాబాద్ ; పోలీసుల అద్భుతమైన సేవలు, వారి త్యాగాలు, నిస్వార్థ పోరాటాలను అక్షరబద్ధం చేస్తూ డాక్టర్. దూత రామకోటేశ్వర రావు సంపాదకత్వంలో వెలువడిన “నాలుగో సింహం” కవితా సంకలనాన్ని బుధవారం హైదరాబాద్లో ఆవిష్కృతమైంది. ఈ ప్రాణ రక్షక కవన సంకలనాన్ని పోలీసు ఉన్నతాధికారులు, కవుల సమక్షంలో ఆవిష్కరించడం పోలీసు వ్యవస్థ పట్ల సమాజానికి ఉన్న గౌరవాన్ని చాటింది. కమిషనరేట్ కార్యాలయం, హైదర్ గూడాలోని కార్యాలయంలో ఆర్థిక నేరాల విభాగం అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ కె.ఎం. కిరణ్ కుమార్ ఈ ప్రత్యేక సంకలనాన్ని ఆవిష్కరించి తోటి పోలీసు అధికారులకు ప్రతులను అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ, పోలీసు సేవలు నిరుపమానమైనవి అని కొనియాడారు. యాభై నాలుగు మంది ప్రముఖ కవులు పోలీసుల కృషిని కీర్తిస్తూ రాసిన అద్భుతమైన కవితలను ఒక సంకలనంగా తీసుకురావడం గర్వించదగిన, అభినందించదగిన విషయమని ప్రశంసించారు. “ఇలాంటి మంచి ప్రయత్నాలు పోలీసు వ్యవస్థను, ప్రజలకు మరింత చేరువ చేస్తాయి. పోలీసుల సేవలకు ప్రజల ఆదరణ, గౌరవం మరింత పెరుగుతాయి” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అపురూప సంకలనం వెలుగు చూడడానికి విశేష కృషి చేసిన డాక్టర్ దూత రామకోటేశ్వర రావు, జె.వి. కుమార్ చేపూరి, ఈ కవితలను రచించిన కవులందరినీ కిరణ్ కుమార్ అభినందించారు. తన చేతుల మీదుగా ఈ సంకలనాన్ని ఆవిష్కరించడం తనకేంతో ఆనందాన్ని కలిగించిందనని హర్షం వ్యక్తం చేశారు.
పోలీసుల త్యాగానికి అక్షర నీరాజనం….”నాలుగో సింహం” కవితా సంకలనం ఆవిష్కరణ…
