తెలంగాణవీణా జాతీయం : అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న రిపబ్లికన్ పార్టీ తాజాగా జాతీయ సదస్సు నిర్వహించింది. ఇందులో ఓ 17 ఏళ్ల అమ్మాయి చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. ‘మీ అందరికీ తెలియని ట్రంప్ గురించి చెబుతానంటూ మాజీ అధ్యక్షుడితో తన అనుబంధాన్ని పంచుకుంది. ఆమె ఎవరో కాదు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ మనవరాలు కై మాడిసన్.బుధవారం రాత్రి జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్లో ట్రంప్ తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. ఇందులో కై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోడియం వద్ద నిలబడి తన తాతయ్య గురించి గర్వంగా ప్రసంగించింది. ‘‘మీడియాలో మా తాతయ్యను భిన్నమైన వ్యక్తిగా చూపిస్తారు. కానీ, ఆయన ఎలాంటి వ్యక్తో నాకు తెలుసు. మీరు చూడని ట్రంప్ గురించి నేను చెప్పాలనుకుంటున్నా. ఆయన మమ్మల్ని ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటారు. స్కూల్లో మేం ఏం చేస్తున్నామో ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. ఓసారి నాకు స్కూల్లో ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు దాన్ని ప్రింట్ తీసి తన స్నేహితులకు చాలా గర్వంగా చూపించారు. మేమిద్దరం కలిసి గోల్ఫ్ ఆడేటప్పుడు.. మా తాతయ్య నన్ను సరదాగా ఓడించాలని ప్రయత్నిస్తారు. ఆ సమయంలో ‘నేనూ ట్రంప్నే’ అని ఆయనకు గుర్తుచేస్తుంటా’’ అని కై నవ్వుతూ చెప్పింది.నా భర్త భారతీయ వంటలు నేర్చుకొన్నాడు..: ఉషా చిలుకూరి ఈ సందర్భంగా ఇటీవల పెన్సిల్వేనియాలో ట్రంప్పై జరిగిన హత్యాయత్నం ఘటనపై ఆమె స్పందించింది. ‘‘అది విని నేను షాకయ్యా..! మా తాతయ్యను చాలామంది ఇబ్బందులకు గురిచేస్తున్నా.. వాటికి ధైర్యంగా ఆయన ఎదురునిలబడ్డారు. తాతయ్యా.. మీరే నాకు స్ఫూర్తి. ఏదో ఒకరోజు మీ స్థాయిని అందుకుంటా. ఐ లవ్ యూ’’ అంటూ కై తన ప్రసంగాన్ని ముగించింది.