Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

కాంగ్రెస్ విజయం వెనుక మాస్టర్ మైండ్!

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. ఎలాంటి సందేహాలు లేకుండా ఎగ్జిట్ పోల్సే నిజమయ్యాయి. హ్యాట్రిక్ కొట్టాలన్న అధికార బీఆర్ఎస్ పార్టీకి భంగపాటు తప్పలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ఓడిపోవడం ఇదే మొదటిసారి. తెలంగాణ రాష్ట్ర  సాధకుడిగా ట్యాగ్ లైన్ ను సొంతం చేసుకున్న సీఎం కేసీఆర్ వంటి రాజకీయ దిగ్గజాన్ని గద్దె దింపిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతమైంది. 

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ప్రజలపై బలమైన ముద్ర వేసినా, ప్రతి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కు మెరుగైన ఓట్ షేర్ లభించినా, రేవంత్ రెడ్డి మొదలు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, వి.హనుమంతరావు, జానారెడ్డి వంటి సీనియర్లందరూ ఏకతాటిపై నిలిచినా, కాంగ్రెస్ అగ్రనాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణపై అధిక దృష్టి పెట్టినా… ఇలా ప్రతి అంశం వెనుక ఉన్న హస్తం… సునీల్ కనుగోలు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా అని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన క్షణం నుంచే సునీల్ కనుగోలు పేరు ఘనంగా వినిపించడం మొదలైంది. చాపకింద నీరులా పనిచేసుకుపోయే 39 ఏళ్ల సునీల్ కనుగోలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. అధికార బీఆర్ఎస్ ను మించిపోయేలా కాంగ్రెస్ ప్రచారం కొనసాగడంలో సునీల్ ది ప్రముఖ పాత్ర. 

సునీల్ తన సామర్ధ్యం నిరూపించుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ జయభేరి మోగించడం వెనుక ఉన్నది కూడా ఇతడే. అతడి వ్యూహ చతురతకు మెచ్చి కర్ణాటక సర్కారు క్యాబినెట్ మినిస్టర్ హోదాతో ప్రభుత్వ సలహాదారుగా నియమించుకుంది. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… సునీల్ కనుగోలు గతంలో ప్రశాంత్ కిశోర్ సహచరుడే. 2014లో ప్రశాంత్ కిశోర్, సునీల్ కనుగోలు బీజేపీ కోసం పనిచేశారు. ప్రశాంత్ కిశోర్ కంటే ముందే సునీల్ కనుగోలు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యక్తిగత వ్యూహకర్తగా పనిచేశారు. సునీల్ కనుగోలు, ప్రశాంత్ కిశోర్ అప్పట్లో సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (సీఏజీ) స్థాపించి ప్రధానిగా నరేంద్ర మోదీని గద్దెనెక్కించడం కోసం కృషి చేశారు. 

సునీల్ కనుగోలు తన పేరు మీదే ‘ఎస్కే… అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్’ సంస్థను ప్రారంభించి దేశంలో 14 ఎన్నికల్లో పలు పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించారు. 2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించడం వెనుక ఉన్నది సునీల్ కనుగోలు తెలివితేటలే. 

సునీల్ కనుగోలు కర్ణాటకలోని బళ్లారిలో ఓ తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. ఆ తర్వాత వాళ్ల కుటుంబం చెన్నైలో స్థిరపడింది. సునీల్ కనుగోలు కుటుంబం విజయవాడ నుంచి వలస వెళ్లినట్టు తెలుస్తోంది. అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసిన సునీల్… ప్రఖ్యాత కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సేలో పనిచేశాడు. ఆ తర్వాత భారత్ వచ్చి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీమ్ లో చేరాడు. ఆ తర్వాత ప్రశాంత్ కిశోర్ సంస్థ నుంచి విడిపోయి సొంతంగా సంస్థను స్థాపించి, కొద్దికాలంలోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you