Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

అయోధ్య రామాలయానికి ఉగ్రముప్పు..

Must read

తెలంగాణ వీణ , జాతీయం : ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి మరికొన్ని రోజులే ఉంది. ఇప్పటికే అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అయోధ్యలో నిర్వహించే ప్రాణ ప్రతిష్ఠను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిపించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. దీని కోసం ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. ఇక రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు. దేశంలోని చాలా మంది స్వామీజీలు కూడా పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే ఉగ్రదాడుల హెచ్చరికలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.

ఉగ్ర హెచ్చరికల నేపథ్యంలో అయోధ్యలోని రామాలయం చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉగ్ర దాడి జరగవచ్చనే నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అనుక్షణం పూర్తి భద్రతా వలయంలో అయోధ్య రామాలయాన్ని ఉంచుతున్నారు. ప్రస్తుతం శరవేగంగా నిర్మితం అవుతున్న భవ్య రామాలయంపై పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న అల్ ఖైదా, లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలు భారీ ఉగ్ర దాడులు జరిపే అవకాశం ఉందని సెక్యూరిటీ ఏజెన్సీలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అడ్వయిజరీని కూడా త్వరలోనే ఆ ఏజెన్సీలు విడుదల చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

అయోధ్య రామ మందిర ప్రారంభ మహోత్సవానికి హాజరు కావాలని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీని ట్రస్ట్ సభ్యులు ఆహ్వానించారు. 2024 జనవరి 22 వ తేదీన అయోధ్య రామాలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతానని ప్రకటించారు. జనవరి 14 వ తేదీన మకర సంక్రాతి తర్వాత రామ్‌లల్లా ప్రతిష్ఠాపన ప్రక్రియ ప్రారంభించి 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. ఇక రామాలయ గ్రౌండ్ ఫ్లోర్ పనులు డిసెంబర్ చివరి నాటికి పూర్తి కానున్నాయి. ఇక 2020 ఆగస్టు 5 వ తేదీన అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you