తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు, తెలంగాణలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు.
అరికెపూడి గాంధీ మాట్లాడుతూ… చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం మంచి పరిణామమని చెప్పారు. చంద్రబాబు కోసం పోరాడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలపుతున్నానని అన్నారు. చంద్రబాబుపై పెట్టినవన్నీ తప్పుడు కేసులేనని… వీటిలో ఒక్క కేసు కూడా నిలబడదని చెప్పారు. ఇప్పుడు బెయిల్ పై బయటకు వచ్చినట్టే… అన్ని కేసుల నుంచి చంద్రబాబు బయటపడతారని అన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని చెప్పారు.

ప్రకాశ్ గౌడ్ స్పందిస్తూ… 53 రోజుల పాటు జైల్లో ఉన్న చంద్రబాబు బెయిల్ పై బయటకు రావడం సంతోషంగా ఉందని అన్నారు.