తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : మద్యంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. డిస్టిలరీలన్నీ చంద్రబాబు అనుమతిచ్చినవేనని తెలిసినా ఆ విషయాన్ని పురంధేశ్వరి దాటవేశారు. మద్యం నిధులు మళ్లించింది చంద్రబాబేనని తేలుతున్నా నోరెత్తని ఆమె.. పైపెచ్చు కాకిలెక్కలు చెబుతూ.. ఈ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మద్యం వినియోగం తగ్గిందని కేంద్ర శాఖ తేల్చిచెప్పిన కానీ, ఇవేవీ పట్టించుకోకుండా ‘ఈనాడు’ రూట్లోనే ఏపీ బీజేపీ చీఫ్ వెళ్తున్నారు. ఏపీలో మద్యం వ్యాపారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించండి’ అంటూ ఈ నెల 9న ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన వార్త పూర్తిగా అవాస్తవంగా తేలింది. 8వ తేదీన పురంధేశ్వరి చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారం.
ఆరోపణ: ఏపీలో చీప్ లిక్కర్ అమ్మకాలు వేలాది ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. మద్యం పేరిట భారీ అవినీతికి తెరలేపి వేల కోట్ల రూపాయలు స్వాహా చేస్తున్నారు.
వాస్తవం: ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారం. సమాజంపై మద్యం వినియోగం ప్రభావాన్ని తగ్గించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్రంలో దశలవారీగా మద్య నియంత్రణ విధానాన్ని ప్రభుత్వం సమర్థంగా అమలుచేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది.