తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : వారాహి విజయ యాత్రను అడ్డుకునేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇలాంటి పిచ్చిచేష్టలు విరమించుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మచిలీపట్నంలోని సువర్ణ కల్యాణమండపంలో మంగళవారం జనవాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో బుధవారం జరిగే వారాహి యాత్రను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా 2వేల మంది గూండాలను, క్రిమినల్స్ను పబ్లిక్ మీటింగ్లో దించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తనవద్ద సమాచారం ఉందన్నారు. వీరంతా సభలోకి చొరబడి రాళ్లు, కత్తులతో దాడి చేసేందుకు కుట్ర చేశారన్నారు. మా సభలో గొడవలు సృష్టిస్తే సహించేది లేదన్నారు. రాష్ట్ర సుస్థిరత కోసం జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తున్నాయని, దాడులతో ఈ కలయికను చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అయన ఆరోపించారు. వారాహి విజయయాత్రలో రాళ్లదాడి జరిగినా, క్రిమినల్స్ ఎటాక్ చేసినా ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ, డీఐజీలు, ఎస్పీ సంపూర్ణ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పులివెందుల మాదిరిగా ఇక్కడ అల్లర్లు సృష్టించాలని చూస్తే ఊరుకునేది లేదని సీఎంను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు.సభ జరిగే సమయంలో జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు రాళ్లు తెచ్చారో, ఎవరు కత్తులు, కటార్లు తీసుకువచ్చారో గమనించి, వారిపై దాడి చేయకుండా కాళ్లు, చేతులు కట్టేసి పోలీసులకు అప్పగించాలని సూచించారు. ఎవరినీ వదలిపెట్టొద్దని అన్నారు. అల్లర్లు చేయాలని వచ్చినవారు మహా అయితే 2వేల మంది ఉంటారని, మనం వేల సంఖ్యలో ఉంటామని, అందరూ అప్రమత్తంగా ఉండి దాడులు చేసేవారిని గుర్తించి బంధించాలని జన సైనికులకు సూచించారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్తు చాలా ఘోరంగా ఉంటుందని జగన్కు మళ్లీ చెబుతున్నానని పవన్ పేర్కొన్నారు.