Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

కావేరి నీటి విడుదలపై.. నేడు రాష్ట్ర బంద్

Must read

తెలంగాణ వీణ , జాతీయం : కావేరి జలాలను తమిళనాడుకు నిరంతరంగా విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ సంఘాల ఐక్యకూటమి ఇచ్చిన శుక్రవారం రాష్ట్ర బంద్‌కు గంటగంటకూ మద్దతు పెరుగుతోంది. బంద్‌కు ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, జేడీఎస్‌, ఆప్‌తోపాటు దాదాపు అన్ని ప్రజాసంఘాలు, రైతు పోరాట కమిటీలు, పర్యావరణ పోరాట సంస్థలు మద్దతు పలికాయి. గురువారం మధ్యాహ్నం సమయానికి మద్దతు ఇచ్చిన సంఘాల సంఖ్య వేయికి పైగా చేరిందని కన్నడ సంఘాల ఐక్యకూటమి అధ్యక్షుడు వాటాళ్‌ నాగరాజు ప్రకటించారు. కావేరీ జలాలతో పాటు ఉత్తరకర్ణాటకలో మహాదాయి నీటి కోసం పోరాటం చేసే రైతు సంఘాలు, ఆల్మట్టి ఎత్తు పెంచాలని డిమాండ్‌ చేసే విజయపుర, బాగల్కోటె ప్రాంత రైతు ప్రతినిధులు మద్దతు ప్రకటించారు. మండ్య, మైసూరు, రామనగర్‌ ప్రాంతాల్లో ఇప్పటికే నిరసనలు తారస్థాయికి చేరాయి. బంద్‌ నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాత్రి జిల్లాల వారిగా ఉత్తర్వులు జారీ చేశారు. రవాణా లేకుండా విద్యాసంస్థలు కొనసాగితే విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తుందని భావించి ముందుగా సెలవు ప్రకటించారు.

అర్ధరాత్రి నుంచే 144 సెక్షన్‌

కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చిన తరుణంలో గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచే బెంగళూరు సహా అన్ని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో 144వ సెక్షన్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 2016 కావేరి గొడవల వేళ విధ్వంసం నేపథ్యంలో పలువురిని ముందుగానే అదుపులోకి తీసుకునేలా అన్ని పోలీసుస్టేషన్ల వారిగా చర్యలు చేపట్టారు. బెంగళూరులో భారీ ర్యాలీ నిర్వహించాలని భావించినా అందుకు పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. 144వ సెక్షన్‌ అమలులో ఉన్నందున ఐదుగురు గుంపుగా తిరగరాదనే ఆదేశాలు జారీ చేశారు. బెంగళూరు పరిధిలో 16వేల మంది పోలీసులను నియమించారు. నిరసన కారులు అన్ని జాతీయ, రాష్ట్ర ప్రధాన రహదారులలోని టోల్‌గేట్ల వద్ద ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఆసుపత్రులు, మెడికల్‌షాపులు, అంబులెన్స్‌లు, యథావిధిగా పనిచేయనున్నాయి. ఆటో, క్యాబ్‌, మినీవ్యాన్‌, మాల్స్‌, సినిమాహాళ్లు, బేకరీలు, హోటళ్ళు పూర్తిగా మూసివేస్తున్నారు. చలనచిత్ర వాణిజ్య మండలి బంద్‌కు మద్దతు తెలిపింది. ప్రైవేటు విద్యాసంస్థల సంఘం రుప్సా బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇచ్చింది. స్వచ్ఛంగా విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

ఆర్టీసీ ఉద్యోగులు అందుబాటులో ఉండాలి
రాష్ట్ర బంద్‌ నేపథ్యంలో బీఎంటీసీ, కేఎ్‌సఆర్టీసీ సహా నాలుగు కార్పొరేషన్ల ఉద్యోగులు అందుబాటులో ఉండాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. డ్రైవర్లు, కండెక్టర్లు సంబంధిత డిపోలలో ఉండాలని తెలిపారు. నగరంలో ఓలా, ఊబెర్‌ డ్రైవర్లు మద్దతు ఇవ్వడంతో సుమారు 50వేలకు పైగా కార్లు నిలిచిపోనున్నాయి. డ్రైవర్ల సంఘాల ప్రకటన మేరకు 1.25 లక్షల ఆటోలు స్తంభించనున్నాయి. కానీ మెట్రో సేవలు యథావిధిగా పనిచేస్తాయి. ఏపీఎంసీ సహా అన్ని మార్కెట్లకు సరుకు రావడం కష్టంగా మారడంతో లావాదేవీలు నిలిచిపోనున్నాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you